సింహాచలం గర్భాలయంలో ఆచారాలు మంటగలిపారు: స్వామి స్వరూపానందేంద్ర

  • అప్పన్న దర్శనం తర్వాత ఆలయ సిబ్బందిపై శారదాపీఠాధిపతి ఫైర్
  • చందనోత్సవానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం
  • భక్తుల అవస్థలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకుండా ఉత్సవాలు జరిపించడమేంటని ప్రశ్న
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. గర్భాలయంలో ఆచారాలను మంటగలిపారని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా.. అని బాధపడుతున్నానని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారని, సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. ‘‘నా జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు. దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాను. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’’ అని స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు.

సింహాచలం ఆలయానికి ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) లేకపోవడం దారుణమని స్వరూపానందేంద్ర అన్నారు. ఇన్ చార్జి ఈవోతో ఉత్సవాలు జరిపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏర్పాట్లు సరిగా లేక సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భక్తులను దర్శించుకుంటే భగవంతుడిని దర్శించుకున్నట్లేనని తాను భావిస్తానని, అలాంటిది ఈ రోజు భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు.

simhachalam
appanna
swamy swaroopanandendra
devotees
arrangements
chandanotsavam

More Telugu News